పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దుబాయ్లోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ముషారఫ్ 1943 ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించారు. 1947లో దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం పాకిస్థాన్కు వెళ్లిపోయింది. కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. లాహోర్లోని ఫోర్మాన్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1964లో పాకిస్థాన్ సైన్యంలో చేరారు. క్వెట్టాలోని ఆర్మీ స్టాఫ్ అండ్ కమాండ్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అయ్యారు. అనంతరం అంచలంచలుగా ఎదిగి పాక్ సైనికదళాల ప్రధానాధికారి పదవిని చేపట్టారు.
1999లో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ సర్కార్పై తిరుబాటు చేసి సైనిక పాలకుడి పగ్గాలు చేజిక్కించుకున్నారు. రెండేండ్ల తర్వాత పాక్ 10వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2001 నుంచి 2008 వరకు దేశాధ్యక్షుడిగా పనిచేశారు. అయితే అభిశంసను తప్పించుకునేందుకు తన పదవికి రాజీనామా చేశారు. 2014 మార్చి 31న దేశద్రోహం కేసులో ఆయనను ఇస్లాబాద్లోని ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది. దేశద్రోహం నేరం కింద మరణశిక్ష విధించింది. దీంతో అరెస్టు చేస్తారనే భయంతో ఆయన దుబాయ్ పారిపోయారు. మార్చి 2016 నుంచి దుబాయ్లోనే ఆశ్రయం పొందుతున్నారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధానికి ఆయనే ప్రధాన కారకుడు.














