తుర్కియే, సిరియాపై ప్రకృతి విరుచుకుపడింది. గంటల వ్యవధిలో సంభవించిన మూడు వరుస భూకంపాలతో రెండు దేశాలూ చిగురుటాకులా వణికిపోయాయి. భారీస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఇరు దేశాల్లో 2,600 మందికి పైగా మరణించగా, వేలాది మందికి గాయాలయ్యాయి. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. భూప్రకంపనల ధాటికి దక్షిణ తుర్కియే, ఉత్తర సిరియాల్లోని పలు నగరాల్లో వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి.
24 గంటల వ్యవధిలోనే మూడు భూకంపాలు చోటుచేసుకొన్నాయి. మొదట రెండు దేశాల సరిహద్దు ప్రాంతంలో తెల్లవారుజాము 4.17 గంటల సమయంలో సంభవించిన శక్తివంతమైన భూకంపం విధ్వంసం సృష్టించింది. రిక్టర్ స్కేల్పై 7.8 తీవ్రత నమోదైంది. ఆగ్నేయ తుర్కియేలోని గాజియాన్తెప్ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో (రిక్టర్ స్కేల్పై 7.5) తుర్కియేలోని ఎకినోజు ప్రాంతంలో, సాయంత్రం ఆరు గంటల సమయంలో (రిక్టర్ స్కేల్పై 6.0) సెంట్రల్ తుర్కియే ప్రాంతంలో భూకంపాలు సంభించాయి. దీంతో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. 50కి పైగా స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకొన్నట్టు భూకంప అధ్యయన కేంద్రాలు వెల్లడించాయి.














