అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే నిర్వహించిన ఓ సర్వేలో అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున మొదటి స్థానంలో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉండగా, రెండో స్థానంలో వివేక్ రామస్వామి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రచారానికి కొందరు సిలికాన్ వ్యాలీ వ్యాపారవేత్తలు నిధుల సేకరణ చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఈనెల 29వ తేదీన ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు రామస్వామి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో ఉన్న సోషల్ క్యాపిటల్ సంస్థ సీఈవో చామాత్ పలిహపిటియా నివాసంలో ఈ విందును నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా 10లక్షల డాలర్ల నిధులు సమీకరించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే డిన్నర్ పార్టీకి హాజరయ్యే వారి వద్ద నుంచి ఒక్కొక్కరి నుంచి భారీగా వసూలు చేయనున్నట్లు తెలిసింది. డిన్నర్లో పాల్గొనాలనుకునేవారి వద్ద నుంచి 50 వేల డాలర్లు వసూలు చేయనున్నట్లు తెలిపింది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.41లక్షలన్నమాట.