భారత సంతతికి చెందిన ప్రముఖ కంప్యూటర్ ఇంజినీర్, ప్రొఫెసర్ అశోక్ వీరరాఘవన్ కు అమెరికాలో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. టెక్సాస్ లో అత్యున్నత అకడమిక్ అవార్డుగా పేరొందిన ఎడిత్ అండ్ పీటర్ ఓడన్నెల్ దక్కింది. ఆ రాష్ట్రంలో ఆయా రంగాల్లో అత్యుత్తమ పరిశోధనలు చేసిన వారికి ప్రతి ఏటా టెక్సాస్ అకాడమీ ఆఫ్ మెడిసిన్, ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్సాలజీ ఈ అవార్డును బహూకరిస్తుంది. ఈ ఏడాది ఇంజినీరింగ్ విభాగంలో చేసిన కృషికిగానూ వీర రాఘవన్కు ఈ అవార్డు వరించింది. చెన్నైలో పుట్టిపెరిగిన వీర రాఘవన్ ప్రస్తుతం హూస్టన్లోని రైస్ యూనివర్సిటీ కి చెందిన జార్జ్ ఆర్.బ్రౌన్ స్కూల్లో కంప్యూటర్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వీరరాఘవన్ బృందం ఇమేజింగ్ టెక్నాలజీలో పలు విప్లవాత్మక పరిశోధనలు చేస్తోంది. ఇమేజింగ్ సాంకేతికత లో ఆయన చేసిన విప్లవాత్మక పరిశోధనలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకోవడం పట్ల వీరరాఘవన్ సంతోషం వ్యక్తం చేశారు. వర్సిటీలోని కంప్యూటేషన్ ఇమేజింగ్ ల్యాబ్లో చాలా మంది విద్యార్థులు, పోస్ట్డాక్టోరల్స్, రీసెర్చ్ సైంటిస్ట్లు గత దశాబ్ద కాలంగా చేసిన అద్భుతమైన, వినూత్న పరిశోధనలకు ఇది గుర్తింపు అని పేర్కొన్నారు.