భారత దేశ అభివృద్ధి ప్రపంచానికి చోదకశక్తిగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూయార్క్ వేదికగా జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ (ఐరాస) సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భారత్ తెచ్చిన సంస్కరణలు ప్రపంచాన్ని మారుస్తాయని తెలిపారు. ప్రపంచానికి డీఎన్ఏ వ్యాక్సిన్ అందించిన తొలి దేశం భారత్ అని తెలిపారు. అఫ్గాన్ను ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారకుండా చూడాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. బాల్యంలో టీ అమ్మిన వ్యక్తి ఇవాళ ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తున్నారు. వందేళ్లలో ఎప్పుడూ చూడని విపత్తును కరోనా రూపంలో చూశాం అన్నారు. కరోనా వల్ల మరణించిన వారందరికీ నివాళులర్పిస్తున్నా అని మోదీ అన్నారు.
కరోనా వేళలలోనూ 3 కోట్ల మందికి ఇళ్లు కట్టించామని తెలిపారు. కరోనా వేళ మేం తెచ్చిన కొవిన్ యాప్ అద్భుతంగా పనిచేసిందన్నారు. దేశంలోని 6 లక్షల గ్రామాలను డ్రోన్ మ్యాపింగ్ చేశామన్నారు. 12 ఏళ్లు దాటిన వారికి ఇచ్చే డీఎన్ఏ టీకాను భారత్ తయారు చేసింది. త్వరలోనే ముక్కు ద్వారా ఇచ్చే టీకాను తీసుకొస్తామన్నారు. ఎంఆర్ఎన్ఏ టీకా తయారీ చివరి దశలో ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందన్నారు. 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నాం అని అన్నారు.
అఫ్గాన్లోని మైనార్టీలకు రక్షణ కల్పించాలి. ఆ దేశంలోని చిన్నారులు, మహిళల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఉగ్రవాదం ప్రపంచానికే ప్రమాదకరంగా మారుతోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు గళం కలపాలి. ప్రపంచ ఉగ్రవాదుల స్వర్గంగా అఫ్గాన్ను మారనీయకూడదన్నారు. కొన్ని దేశాలు తీవ్రవాదాన్ని రాజకీయంగా ఆయుధంగా వాడుతున్నాయి అని పాక్ పేరును ప్రస్తావించకుండా ప్రధాని దాయాది దేశంపై విమర్శలు గుప్పించారు.