కరోనాతో దెబ్బతిన్న పర్యాటక రంగం పునరుద్ధరణ కోసం ఇప్పటికే కేంద్రం అనేక చర్యలు తీసుకుందని, విదేశీయులకు 5 లక్షల ఉచిత వీసాలు కూడా మంజూరు చేసిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి ప్రసంగించారు. కరోనాతో కుదేలైన పర్యాటక రంగం కోలుకోవాలంటే కొవిడ్ 19 వ్యాక్సిన్ కార్యక్రమమే కీలకమని తెలిపారు. వీలైనంత ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకుంటే పర్యాటక రంగం మళ్లీ పుంజుకుంటుందని అన్నారు. దేశంలో 85 కోట్లకు పైగా ప్రజలు టీకాలు వేసుకున్నారని చెప్పారు. దేశీయ పర్యాటక రంగానికి అపారమైన సామర్థ్యం ఉందని మంత్రి అంతగా ప్రాచుర్యం పొందని, ఎవరికీ తెలియని సూదూర ప్రాంతాలను పరిచయం చేసేందుకు తమ మంత్రిత్వశాఖ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని అన్నారు.