ఇద్దరు ప్రాణస్నేహితులు ప్రత్యర్థులుగా మారతారు. వారిని ఆ దిశగా నడిపించిన పరిస్థితులు ఏమిటి? వారి జీవితాల్లో ఎలాంటి సంఘర్షణ నెలకొని ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానమే మహాసముద్రం అని అన్నారు అజయ్భూపతి. ఈ చిత్రంలో హే తికమక మొదలే యద సొద వినదే అనే పల్లవితో సాగే గీతాన్ని విడుదల చేశారు. రెండు జంటల ప్రేమపయనాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. చైతన్భరద్వాజ్ స్వరపరచిన ఈ గీతాన్ని హరిచరణ్, నూతన్మోహన్ ఆలపించారు. కిట్టు వరప్రసాద్ రచించారు. సముద్రమంతటి లోతైన, గంభీర భావోద్వేగాలతో నడిచే కథాంశమిది అని చిత్రబృందం తెలిపింది. అజయ్భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. అదితిరావు హైదరీ, అనుఇమ్మాన్యుయేల్ కథానాయికలు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్తోట, నిర్మాత: రామబ్రహ్మం సుంకర.














