ప్రతిష్టాత్మక గామా అవార్డ్స్ అయిదో ఎడిషన్ వేడుకలు ఆగస్ట్ 30న దుబాయ్లోని షార్జా ఎక్స్పో సెంటర్లో గ్రాండ్గా జరుగనున్నాయి. వైభవ్ జ్యూవెలర్స్ ఈ అవార్డ్ కార్యక్రమానికి టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్నది. హైదరాబాద్లో కర్టన్రైజర్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గామా సీఈవో సౌరబ్ కేసరి, వైభవ్ జ్యూవెలర్స్ ఎండి రాఘవ్, జ్యూరీ సభ్యులు, ప్రముఖ దర్శకులు ఏ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, హీరోయిన్లు ఫరియా అబ్దుల్లా, మానస వారణాసి, దక్షా నాగార్కర్, నటుడు వైవా హర్ష పాల్గొన్నారు.

ఇది కమర్షియల్ ఈవెంట్ కాదు. కళాకారులపై మా తండ్రిగారికి ఉన్న అభిమానం కారణంగా ఈ ఈవెంట్ మొదలైంది. దాన్ని అందరి సపోర్ట్తో ముందుకు తీసుకెళ్తున్నాం. వచ్చే ఏడాది మరింత గ్రాండ్గా చేస్తాం. దుబాయ్లో ఉన్న తెలుగువారితోపాటు ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరినీ అబ్బురపరిచేలా ఈ ఈవెంట్ నిర్వహించనున్నాం. జ్యూరీ సభ్యుల సహకారంతో అవార్డు విజేతలను ఎంపిక చేశాం అని గామా సీఈవో సౌరబ్ కేసరి తెలిపారు. ఇంకా జ్యూరీ సభ్యులు ఏ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్ కూడా మాట్లాడారు.

సిద్దు జొన్నలగడ్డ, తేజ సజ్జ, కిరణ్ అబ్బవరం, శ్రీవిష్ణు, రోషన్, మీనాక్షి చౌదరి, దక్షా నాగర్కర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఊర్వశి రౌతేలా, కేతిక శర్మ, ఫరియా అబ్దుల్లా, ప్రియా హెగ్డే, శ్రీదేవి వంటి హీరోయిన్లు తమ ప్రదర్శనలతో అలరించనున్నారు. బ్రహ్మానందం, సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్, వెన్నెల కిశోర్ వంటి ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా రానున్నారు. ఈ వేడుకలో సుమతో కలిసి వైవా హర్ష వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. గామా జ్యూరీ చైర్పర్సన్లుగా ఏ. కోదండరామిరెడ్డి, కోటి, బి. గోపాల్ వ్యవహరిస్తున్నారు. 2024లో విడుదలైన చిత్రాల్లో వివిధ విభాగాలకు ఈ అవార్డులను అందించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ అభిమానులు ఈ ప్రతిష్టాత్మక వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
















