అమెరికా వెళ్లాలనుకునే వ్యాపారులు, పర్యాటకుల కోసం ట్రంప్ సర్కా్ర్ కొత్త విధానాన్ని తీసుకురాబోతుంది. వీసా ఇంటర్యూల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా 10 రోజుల్లోనే వీసా ఇంటర్వ్యూలను నిర్వహించేలా స్పెషల్ పైలట్ ప్రోగ్రామ్ నిర్వహించాలని నిర్ణయించింది. దీనికోసం ప్రీమియం ఎక్స్పెడైటెడ్ సర్వీస్ పేరుతో ప్రత్యేక సేవలను ప్రారంభించనుంది. ఈ మేరకు అమెరికా విదేశాంగశాఖ తమ ఫెడరల్ రిజిస్టర్లో నోటీసులు ప్రచురించింది.

ఈ నోటీసు ప్రకారం జూలై 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ పైలట్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సేవలను వినియోగించుకోవాలంటే సాధారణ ఫీజు 185 డాలర్లకు అదనంగా 750 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద 750 డాలర్లు అదనంగా చెల్లించిన దరఖాస్తుదారులకు 10 రోజుల్లోపే వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కల్పించనున్నారు. అయితే ఈ సదుపాయం ఎంపిక చేసిన కొన్ని అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. వాటి జాబితాను జూలై 1వ తేదీకి ముందు ప్రకటించనున్నారు.

అయితే, ఈ అదనపు ఫీజు చెల్లించడం ద్వారా ఇంటర్వ్యూ షెడ్యూల్ను మాత్రమే త్వరగా పొందగలరని.. వీసా కచ్చితంగా మంజూరు అవుతుందనే హామీ లేదని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దరఖాస్తుదారుల అర్హతల ఆధారంగానే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. డిమాండ్ను బట్టి ఈ పైలట్ ప్రోగ్రామ్ను వచ్చే ఏడాదికి పొడిగించే అవకాశం ఉందని సమాచారం.





























