రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు దెబ్బ తినే విధంగా రాజకీయాలు చేయకూడదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. లండన్ లో హరీశ్ రావు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడంపై దృష్టి సాధించకుండా గూగుల్ ప్రచారంపై దృష్టిపెట్టడం దురదృష్టకరమని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అనేక అద్భుతాలు సాధించిందని తెలిపారు. పాలకులే నెగెటివ్ మైండ్ సెట్తో ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అనేక అద్భుతాలు సాధించింది. ఒకప్పుడు బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే నానుడి ఉండేది. కానీ కేసీఆర్ పాలనతో తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే కాడికి తెచ్చాం. గత 10 ఏండ్లలో తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంది. తలసరి విద్యుత్ వినియోగంలో కూడా దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. జీఎస్డీపీ గ్రోత్లో తెలంగాణకు దరిదాపులో కూడా ఏ రాష్ట్రం లేదు. నల్లా ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని కేసీఆర్ అందించారు. మ్యానిఫెస్టోలో పెట్టుకోకపోయినా ఇంటింటికీ తాగునీరు అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్. అసెంబ్లీలో వచ్చే ఎన్నికల నాటికి ప్రతి ఇంటికి నల్ల ద్వార నీళ్లియ్యకపోతే ఓట్లు అడుగను అని చెప్పిన గొప్ప నాయకుడు. మిషన్ భగీరథ కార్యక్రమంతో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించి చూపించారన్నారు.















