అమెరికాలో నివసిస్తున్న భారతీయులు, మరీ ముఖ్యంగా కొందరు ప్రవాస తెలుగువారి ప్రవర్తనతో భారతీయులకు చెడ్డపేరు వస్తోంది. కొందరు అవగాహనా రాహిత్యంతో వ్యవహరిస్తుండడంతో ప్రవాస భారతీయుల గౌరవానికి భంగం వాటిల్లుతోంది అని డల్లాస్ లో వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరి విపరీత పోకడల వల్ల భారతీయులదరూ అపఖ్యాతిని మూటగట్టుకోవాల్సి వస్తోందని చెప్పారు. తోటకూర ప్రసాద్ ఆధ్వర్యంలో డల్లాస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సులో స్థానిక చట్టాలు, నియమనిబంధనలు, సాంస్కృతిక విలువలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా ఎలా జీవించాలన్న అంశంపై చర్చించారు. విభిన్న సంస్కృతులు, భాషలు, మతాల ప్రజలు నివసించే అమెరికాలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ప్రవాస భారతీయుల ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయని వక్తలు వాపోయారు. అమెరికా చట్టాల ప్రకారం అనుమతులు లేకుండా వీధుల్లో ఉత్సవాలు జరుపుకోవడం, బాణసంచా కాల్చడం, లౌడ్స్పీకర్లు వినియోగించడం ప్రమాదకరమని చెప్పారు. రోడ్లు మూసివేసి జరిపిన ఉత్సవాల వల్ల ఒక అమెరికన్ డ్రైవర్ తుపాకీతో బెదిరించిన ఘటనను ఉదహరించారు. ఇలాంటి వేడుకలు ఆలయ ప్రాంగణాలు లేదా ఖాళీ స్థలాల్లోనే చేసుకోవాలని కోరారు. సినిమా థియేటర్ల వద్ద పాలతో అభిషేకాలు, ఈలలు, డ్యాన్సులు వంటి విపరీత చేష్టల వల్ల అమెరికన్లు మనల్ని చిన్నచూపు చూస్తారని, ఇలాంటి ఘటనలు ప్రవాస భారతీయులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు.


రాజకీయ నాయకుల అమెరికా పర్యటనల సందర్భంగా కార్ల ర్యాలీలు, నినాదాలు, హోటళ్ల వద్ద గోల చేయడం సరికాదన్నారు. అమెరికన్లతో స్నేహపూర్వక సంబంధాలు మెరుగుపర్చుకోవాలని చెప్పారు. డాలస్ను డల్లా్సపురమని, గంటర్ను గుంటూరు అని, క్యారల్టన్ను కేరళటౌన్ అని పేర్కొనడం వల్ల చులకన భావం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. దుకాణాల్లో దొంగతనాలు, మద్యం సేవించి వాహనాలు నడపడం, బహిరంగ స్థలాల్లో బిగ్గరగా మాట్లాడడం వంటి పనులతో చెడ్డపేరు వస్తుందని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా రాజకీయ విమర్శలు, అనుచిత పోస్టులు అమెరికన్ అధికారుల దృష్టికి వస్తాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఈ అవగాహానా సదస్సులో తానా, ఆటా, నాటా, నాట్స్, టాన్టెక్స్, టిపాడ్, డేటా, సురభి రేడియో, గ్రేటర్ ఫోర్ట్ వర్త్ హిందూ టెంపుల్ మొదలైన సంస్థల ప్రతినిధులు, వ్యాపార వేత్తలు, ఎన్నో దశాబ్దాలగా డాలస్ పరిసర ప్రాంతాలలో స్థిర నివాసంఉంటున్న రావు కల్వాల, ఎంవిఎల్ ప్రసాద్, వినోద్ ఉప్పు, చినసత్యం వీర్నపు, రవీంద్ర పాపినేని, రమాప్రసాద్, శ్రీ బండా, వినయ్ కుడితిపూడి, వి.ఆర్ చిన్ని, రాజేశ్వరి ఉదయగిరి, లక్ష్మి పాలేటి, రవి తూపురాని, వెంకట్ నాదెళ్ళ, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, అనిల్ గ్రంధి, శుభాష్ నెలకంటి, విక్రం జంగం, సురేష్ మండువ, రాజేష్ వెల్నాటి, సతీష్ రెడ్డి, విజయ్ కాకర్ల, బాబీ, రఘువీర్ రెడ్డి మర్రిపెద్ది, శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, శ్రీనివాస్ గాలి, మాధవి లోకిరెడ్డి, రాజేష్ అడుసుమిల్లి, సురేష్ మండువ, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, మురళి వెన్నం మొదలైన ప్రవాస భారతీయనాయకులు హాజరై వారి వారి అభిప్రాయాలను పంచుకున్నారు.
















