అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాల అధినేతలు భేటీ అయ్యారు. దక్షిణ కొరియా వేదికగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చైనాకు ట్రంప్ గుడ్న్యూస్ చెప్పారు. చైనాపై విధించిన టారిఫ్లను 10శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

బుసాన్లో దాదాపు రెండు గంటల పాటూ జరిగిన భేటీలో పలు అంశాలపై ఇరువురూ చర్చించారు. ఇక భేటీ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ జిన్పింగ్తో సమావేశం అద్భుతంగా జరిగిందని తెలిపారు. అనేక అంశాలపై చర్చించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఫెంటనిల్ పేరుతో చైనాపై విధించిన 20శాతం సుంకాలను 10శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ భేటీలో సోయాబీన్ కొనుగోళ్లను తిరిగి ప్రారంభించడం, అరుదైన ఖనిజాల ఎగుమతికి సంబంధించిన సమస్యలు పరిష్కారమైనట్లు ట్రంప్ తెలిపారు. ఈ సందర్భంగా జిన్పింగ్పై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఆయన ఓ గొప్ప నేత అని కొనియాడారు.
















