మహేశ్బాబు కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ పాన్ వరల్డ్ మూవీకి వారణాసి అనే పేరును ఖరారు చేశారు. హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో గ్లోబ్ ట్రాటర్ పేరిట నిర్వహించిన ఈ సినిమా భారీ ఈవెంట్లో వేలాది అభిమానుల సమక్షంలో టైటిల్ను, గ్లింప్స్ను విడుదల చేశారు. వీడియో గ్లింప్స్లో మహేష్బాబు నందిపై త్రిశూలాన్ని చేతబూని ఉగ్రరూపంలో వస్తూ కనిపించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ మహాభారతం, రామాయణం అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు రామాయణంలోని ఓ ఘట్టం తీస్తానని అనుకోలేదు. ఒక్కొక్క సీన్ తీస్తుంటే నేను నేలపై లేను, గాలిలో ఉన్నాననిపించింది. ఫస్ట్టైమ్ మహేశ్ని రాముడి వేషంలో ఫొటో షూట్ చేస్తుంటే గూజ్బంప్స్ వచ్చాయి. మహేశ్ కొంటెగా ఉంటాడు. కృష్ణుడిగా బావుంటాడనుకుంటూనే ఫొటో షూట్ చేశాం. కానీ రాముడిగా అత్యద్భుతంగా ఉన్నాడు అని అన్నారు.

మహేష్బాబు మాట్లాడుతూ ఈ స్టేజీ మీదకు సింపుల్గా నడిచి వస్తానంటే రాజమౌళి కుదరదని చెప్పాడు. ఇలా కొత్తగా డ్రెస్ డిజైన్ చేశారు. ఇదంతా మీకోసమే. ఈ గ్లింప్స్ గురించి నా డైలాగ్లో చెప్పాలంటే, దిమ్మతిరిగి మైండ్బ్లాక్ అయింది. నేను పౌరాణిక సినిమాల్లో బాగుంటానని నాన్నగారు ఎప్పుడూ చెప్పేవారు. ఎందుకోగానీ నేను ఆయన మాట వినలేదు. కానీ ఈ సినిమాలో ఆయన మాటను పాటించాను. ఈ సినిమా నా డ్రీమ్ ప్రాజెక్ట్. జీవితకాలంలో ఒకేసారి వరించే అవకాశం. ఈ సినిమా కోసం ఎంతకష్టమైనా పడతాను. ఇది రిలీజైనప్పుడు భారతదేశం మొత్తం గర్వంగా ఫీలవుతుంది. ముందుముందు ఈ సినిమా ఎలా ఉండబోతున్నదో మీ ఊహకే వదిలేస్తున్నా అన్నారు. దిగ్గజ కళాకారులు, సాంకేతిక నిపుణులతో కలిసి ఈ సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నానని కథానాయిక ప్రియాంకచోప్రా పేర్కొంది.















