
జీ20 సదస్సు నిర్వహణపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్బర్గ్లో రెండు రోజుల పాటు జీ20 సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. ఆఫ్రికా ఖండంలో ఈ సదస్సు జరగడం ఇదే మొదటిసారి. ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరైన విషయం తెలిసిందే. భారత్, దక్షిణాఫ్రికా నేతలు ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా రమఫోసా మాట్లాడుతూ జీ20 శిఖరాగ్ర సమావేశాల నిర్వహణలో భారత్ అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఇంత కష్టమైన పని అని చెప్పి ఉంటే., ముందే పారిపోయేవాళ్లమని సరదాగా వ్యాఖ్యానించారు. సదస్సు నిర్వహణ విషయంలో భారత్ నుంచి చాలా నేర్చుకున్నామని తెలిపారు. భారత్ జీ20 సదస్సు ప్రాంగణం చాలా గొప్పగా ఉందని, తమ వేదిక చాలా చిన్నదని చెప్పారు. అయితే, ఇటువంటి వేదికలే ఎల్లప్పుడూ అందంగా ఉంటాయని ప్రధాని మోదీ స్పందించారు. 2023, సెప్టెంబర్లో 18వ జీ20 సదస్సును ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన విషయం తెలిసిందే.















