రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో మంగళవారం నాడు వివిధ కంపెనీల ప్రతినిధులు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. భారత్ ఫ్యూచర్ సిటీలో రెండో రోజూ జరిగిన సమ్మిట్లోనూ దిగ్గజ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మంగళవారం రాత్రి 9 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం మొత్తంగా రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. రెండో రోజంతా పెట్టుబడుల జాతర కొనసాగింది. తొలి రోజు రూ.2.43 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగిన విషయం తెలిసిందే. రెండో రోజు రూ. 3.32 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాల పెంపునకు వచ్చిన భారీ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగపడను న్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, ఔషధ రంగం, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులతో పాటు ఉద్యోగాలు వెల్లడించాయి. ఇన్ఫ్రాకీ డాటా సెంటర్ పార్క్స్ 150 ఎకరాల్లో 1 గిగావాట్ సామర్థ్యం గల భారీ డేటా పార్క్ అభివృద్ధి చేపట్టేందుకు రూ.70 వేల కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చింది. జెసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ.9 వేల కోట్ల పెట్టుబడులకు హామీ ఇచ్చింది. పెద్ద స్థాయి డేటా సెంటర్ల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపింది.. దీంతో సుమారు 2 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
















