మిడిల్ ఈస్ట్ దేశాల్లో కొనసాగుతోన్న సంక్షోభాన్ని విమానయాన సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. దుబాయ్ నుంచి ముంబైకి నడిచే నాన్ స్టాప్ ఫ్లైట్లలో టికెట్ రేట్లను మార్చి 10-15 మధ్య ఏకంగా రూ.45-65వేలకు(సాధారణంగా రూ.10-20వేలు) పెంచాయి. ఇతర ప్రధాన నగరాలకూ ఇదే తరహా రేట్లు ఉన్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎమిరేట్స్, ఎయిర్ అరేబియా ఒకదానికొకటి పోటీ పడి వసూలు చేస్తున్నాయి.

ఉదాహరణకు లండన్ నుంచి హైదరాబాద్కు బయల్దేరే డైరెక్ట్ ఫ్లైట్ చార్జీ సుమారు రూ. 2.5 లక్షలు ఉంది. సాధారణంగా ఈ రూట్లో టికెట్ చార్జీ చాలా తక్కువ ఉంటుంది. కాని ప్రస్తుత పరిస్థితిలో అది రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. గల్ఫ్ దేశాల నుంచి తిరుగు ప్రయాణమవుతున్న ప్రయాణికులు సైతం ఇటువంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారు. గడచిన కొన్ని రోజులుగా ప్రధాన గల్ఫ్ నగరాల నుంచి హైదరాబాద్కు వెళ్లే విమాన చార్జీలు 200 శాతం వరకు పెరిగినట్లు ట్రావెల్ ఏజెంట్లు తెలిపారు. చాలా తక్కువ సంఖ్యలో విమానాలు నడుస్తుండడం, చాలా రూట్లను మళ్లించడంతో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా పోయాయి.















