హేమంత్ ఇప్పలపల్లి దర్శకత్వ, నిర్మాణ బాధ్యతలను భుజాన వేసుకుని రూపుదిద్దిన వినూత్న చిత్రం ఫస్ట్ టైం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ మరియు ఈ పిల్ల నేను అనుకోలేదు అనే ప్రత్యేక గీతాన్ని చిత్ర యూనిట్ అత్యంత వైభవంగా విడుదల చేసింది. ఈ సినిమాలో సౌరబ్ ధింగ్ర కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవు తుండగా, అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్ రోల్లో అలరించనున్నారు. అనిక్క విక్రమన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ ఫేమ్ పండు వంటి ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీ వెంకట్ మరియు సూరజ్ ఎస్ కురుప్ అద్భుతమైన సంగీతాన్ని అందించగా, వేణు మురళీధర్ మరియు రామ్ తమ కెమెరా పనితనంతో విజువల్స్ అందించారు.

ఈ వేడుకకు టాలీవుడ్ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురి, జీ చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్ అతిథులుగా విచ్చేయగా, చిత్ర పరిశ్రమకు చెందిన అందాల తార పాయల్ రాజ్పుత్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ తాను చిత్ర పరిశ్రమకు వచ్చి 50 సంవత్సరాలు దాటిందని, ఈ వయసులో తనకు పెళ్లి చేసుకోవాలన్నా కష్టమేనని చమత్కరించారు. అయితే ప్రముఖ దర్శకుడు రాజమౌళి గారిని ఆదర్శంగా తీసుకుని హేమంత్ ఒక్కడే ఒక సినిమాకు సంబంధించిన ఎన్నో విభాగాలను దగ్గరుండి చూసుకోవడం మరియు ఇంత పెద్ద బాధ్యతను మోయడం అందరం అభినందించదగ్గ విషయమని కొనియాడారు. సరికొత్త కాన్సెప్ట్ మరియు వైవిధ్యమైన కథతో వస్తున్న ఈ కొత్త కుర్రాళ్ళ ప్రయత్నాన్ని పరిశ్రమ పెద్దలు, ప్రేక్షకులు ఆదరించాలని, ఈ నెల 22వ తేదీన థియేటర్లలోకి రానున్న ఈ ఫస్ట్ టైం చిత్రాన్ని వీక్షించి ఘన విజయాన్ని అందించాలని కోరారు.





























