
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి అమెరికా కోర్టులో ఊరట లభించింది. సోలార్ కాంట్రాక్టుల కేసులో గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీపై మోపిన క్రిమినల్, సివిల్ ఫ్రాడ్ అభియోగాలను ఉపసంహరించుకొన్నట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్తో పాటు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) కేసులను వెనక్కి తీసుకొన్నట్టు ప్రకటించాయి. అమెరికాలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, అయితే కోర్టులో కేసుల కారణంగా దీనికి ముందడుగు పడటం లేదని గత నెలలో అదానీ న్యాయవాది కోర్టులో వాదించారు. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వం అదానీపై కేసుల విషయంలో వెనక్కి తగ్గడం గమనార్హం.





























