బే ఏరియాలోని శాన్ జోస్ లో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు దేవీ శ్రీ ప్రసాద్ లైవ్ కాన్సర్ట్ తో అదరగొట్టారు. బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా), బే ఏరియా ఎంటర్టైన్మెంట్స్, రియల్టర్ నాగరాజ్, అపెక్స్ కన్సల్టింగ్ సర్వీసెస్ సంయుక్తంగా నిర్వహించిన లైవ్ కాన్సర్ట్ గ్రాండ్ సక్సెస్ అయింది. సంగీతం, ఉత్సాహం, సామాజిక స్ఫూర్తి ప్రతిబింబించిన ఈ ఈవెంట్లో వేలాదిమంది ఉత్సాహంగా పాల్గొన్నారు. చార్ట్బస్టర్ హిట్స్, నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందించిన ఈ కాన్సర్ట్ దాదాపు 3 గంటల పాటు సాగింది. తన ఎనర్జిటిక్ పర్మార్ఫెన్స్తో దేవీ శ్రీ ప్రసాద్ పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ అలరించారు. డీఎస్పీతోపాటు కార్తీక్, సమీరా భరద్వాజ్, రీతా, సాగర్, డ్యాన్సర్లు అలరించారు.


27 ఏళ్ల క్రితం సంగీత దర్శకుడిగా దేవీ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టానని, ఇప్పుడు నటుడిగా మొదటి సినిమా కూడా అమ్మవారి కథతో మొదలుబెట్టడం సంతోషంగా ఉందన్నారు. సంగీత దర్శకుడిగా విజయవంతం అయినట్లుగానే నటుడిగా మొదలుబెట్టిన ఈ కొత్త అధ్యాయం కూడా అంతే విజయవంతంగా ఉంటుందని ఆశిస్తున్నానని చెప్పారు. 2008 నుంచి తన అమెరికా కాన్సర్ట్ టూర్లలో శాన్ జోస్ ఎప్పుడూ ప్రత్యేకమైనదేనని దేవీ అన్నారు. బాటా మద్దతు ఇందుకు కారణమని చెప్పారు. ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ కావడానికి కృషి చేసిన బాటా టీమ్, వాలంటీర్లు, స్పాన్సర్లు, సపోర్టర్లకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. నెలల తరబడి ప్లానింగ్ చేసి ఎటువంటి లోటు లేకుండా ఈ ఈవెంట్ను విజయవంతం చేసిన బాటా ఆర్గనైజింగ్ టీమ్కు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.






























