Skip to main content

Namaste NRI

విదేశీ ప్రయాణాలపై కొత్త పన్ను?

విదేశీ ప్రయాణాలపై పన్ను/సెస్సు/సర్‌చార్జీ విధించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నది. అయితే దీనిపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపింది. విదేశీ ప్రయాణాలపై విధించే పన్ను/సెస్సు/సర్‌చార్జీ నేరుగా కేంద్రానికే చెందుతుందని, విభజించదగిన నిధిగా కాదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనపై అత్యున్నత స్థాయిలో చర్చ జరుగుతున్నట్లు వారు చెప్పారు. విదేశీ ప్రయాణాలపై విధించే పన్ను/సెస్సు/సర్‌చార్జీ తాత్కాలికంగా ఏడాది పాటు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. అమెరికా-ఇరాన్‌ ఘర్షణల నేపథ్యంలో పెరిగిన ముడి చమురు ఖర్చులను తగ్గించడానికి ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వారు చెప్పారు.

గల్ఫ్‌ సంక్షోభ సమయంలో భారత్‌పై పడిన దాదాపు 1 ట్రిలియన్‌ డాలర్ల దిగుమతుల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ప్రజలు అనవసర విదేశీ ప్రయాణాలను మానుకోవాలని, ఏడాది పాటు ఇంధన వినియోగం, బంగారు ఆభరణాల కొనుగోళ్లపై ఆంక్షలు విధించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పెరుగుతున్న ప్రపంచ ద్రవ్యోల్బణం నేపథ్యంలో ప్రయాణాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇరాన్‌ హొర్ముజ్‌ జలసంధిని మూసివేయడంతో ప్రపంచ చమురు, ఎల్‌ఎన్‌జీ సరఫరాలో ఐదవ వంతుకు అంతరాయం ఏర్పడింది. దీంతో ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్ల మేరకు చేరుకుంది. విమానయాన సంస్థలు ఇంధన సర్‌చార్జీలను పెంచడంతో విమాన చార్జీలు ఇప్పటికే విపరీతంగా పెరిగాయి.

Social Share Spread Message

Latest News