కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ యూకే పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్ ను కలిశారు. జైశంకర్ తన భార్య కోక్యోతో కలిసి యూకే ప్రధాన మంత్రి అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ కు వెళ్లారు. జైశంకర్ దంపతులకు సునాక్ దంపతులు సాదర స్వాగతం పలికారు. సునాక్కు భారత ప్రధాని మోదీ తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గణపతి విగ్రహాన్ని అందించారు. దాంతోపాటు భారత స్టార్ క్రికెటర్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్ ను కూడా సునాక్కు బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా రిషి సునాక్, జైశంకర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.














