మెగా ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో ఓ మల్టీస్టారర్ మొదలైంది. వినోదయ సిత్తం అనే చిత్రానికి రీమేక్గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. మాతృకకు దర్శకత్వం వహించిన సముద్రఖని తెలుగులోనూ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీస్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత కాగా వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫాంటసీ కామెడీ డ్రామా కథతో తమిళంలో మంచి విజయాన్ని సాధించిందీ చిత్రం. తెలుగు రీమేక్లో మన నేటివిటీతో పాటు పవన్ ఇమేజ్కు తగినట్లుగా మార్పులు చేసినట్లు సమాచారం. థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో మామాఅల్లుళ్లు ఇద్దరూ బ్లాక్ డ్రెస్లో మెరిసిపోయారు. తాజాగా చిత్రబృందంతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సంతోషాన్ని పంచుకున్నారు హీరో సాయిధరమ్ తేజ్. ఆయన స్పందిస్తూ నా జీవితానికి గురువుగా భావించే పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించాలనే కల ఈ సినిమాతో తీరుతున్నందుకు ఆనందంగా ఉంది. సెట్స్లో అడుగుపెట్టే రోజు కోసం వేచి చూస్తున్నా అని పేర్కొన్నారు.














