గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్యను తగ్గించేందుకు మరియు చిన్న రైతులకు సహాయంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) కోశాధికారి, ప్రముఖ ఎన్ఆర్ఐ రాజా కసుకుర్తి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. వేసవి కాలంలో త్రాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను దృష్టిలో ఉంచుకుని సుమారు రూ. 4 లక్షల విలువైన త్రాగునీటి ట్యాంకర్ను హనుమాన్ జంక్షన్, వీరావల్లి మరియు పరిసర గ్రామాల ప్రజలకు అందజేశారు. అదేవిధంగా చిన్న రైతులకు ఉపయుక్తంగా రూ. 75 వేల విలువైన వీడ్ వాకర్ (వ్యవసాయ పరికరం)ను కూడా విరాళంగా అందించారు.


ఈ సందర్భంగా అందజేసిన త్రాగునీటి ట్యాంకర్ మరియు వాటర్ డిస్పెన్సర్ను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు, విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కృష్ణా జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ గద్దె అనూరాధ, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు సమిష్టిగా ప్రారంభించారు. ‘పీ-4’ స్ఫూర్తితో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, రైతులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ట్యాంకర్ ద్వారా గ్రామాల్లో త్రాగునీటి సమస్యకు గణనీయమైన ఉపశమనం కలుగుతుందని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.


ఈ సందర్భంగా ఆర్టీసీ మాజీ చైర్మన్ కోనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ప్రజలకు సేవలందించడం సామాజిక బాధ్యతగా భావించి రాజా కసుకుర్తి చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని, గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్యను పరిష్కరించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. విదేశాల్లో ఉన్నప్పటికీ స్వగ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న రాజా కసుకుర్తి సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. ఇతర నాయకులు కూడా మాట్లాడుతూ రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలను అందించడం వల్ల వారి పనులు సులభమవుతాయని, ఈ కార్యక్రమం వారికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు, విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కృష్ణా జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ గద్దె అనూరాధ, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, ఆర్టీసీ మాజీ చైర్మన్ కోనకళ్ల నారాయణరావు తదితరులతో పాటు గ్రామానికి చెందిన ప్రముఖులు కలపాల శ్రీధర్, గుండపనేని ఉమామహేశ్వరరావు, మాజీ సర్పంచ్ పిల్లా అనిత, రామారావు, అమృతవల్లి సూర్యనారాయణ, లంక అజయ్, మండాది రవీంద్ర మరియు ఇతర గ్రామ పెద్దలు, రైతులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజా కసుకుర్తి తన సందేశంలో గ్రామీణ ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పించడం మరియు చిన్న రైతులకు అవసరమైన పరికరాలు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఆయన పంపిన ఈ సేవా కార్యక్రమం గురించి స్థానిక ప్రముఖుడు కలపాల శ్రీధర్ వివరించి, రాజా కసుకుర్తి గ్రామాల అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుండి సహాయం చేస్తున్నారని, ఈ ట్యాంకర్ మరియు వ్యవసాయ పరికరాలు గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.

గ్రామీణాభివృద్ధి కోసం చేపట్టిన ఈ కార్యక్రమం స్థానిక ప్రజల ప్రశంసలు అందుకుని, రాజా కసుకుర్తి సేవలు గ్రామాల్లో ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకువస్తున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు.















