అమెరికాలోని న్యూజెర్సీలో గల ఎడిసన్ నగరంలో మేము సైతం బాబు కోసం అంటూ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నాయకులు మన్నవ మోహనకృష్ణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ మచ్చలేని నేత చంద్రబాబు నాయుడుకు అవినీతి రంగు పూయడానికి జగన్ అక్రమ కేసులు బనాయిస్తున్నా రని ఆరోపించారు. నీతినిజాయితీలకు నిలువుటద్దమైన చంద్రబాబుకు ఆపద కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు ప్రజలతో పాటు ప్రవాసాంద్రులు కూడా వెన్నుదన్నుగా నిలిచారన్నారు. రానున్న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ మనుగడకే పరీక్ష అని, ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టడానికి, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిని గెలిపించడానికి ప్రతి ప్రవాసాంద్రుడు వెన్నుదన్నుగా నిలవాలని అన్నారు.

ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు మేము సైతం బాబు కోసం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ బాబుకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం ఆమోదించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమికి అమెరికాలోని తెలుగు ప్రజలతో పాటు విదేశాలలోని ప్రతి ఆంధ్రుడు సంఘీభావంగా నిలవాలని కోరుతూ ఆత్మీయ సమావేశం తీర్మానించింది.

. శ్రీహరి మందడి, రమేష్ నూతలపాటి, మోహన్ కుమార్, వంశీ వెనిగళ్ల, వెంకట్ సూడ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విజయవంతం చెసేందుకు వారు విశేష కృషి చేశారు. తెలుగు దేశం పార్టీ అభిమానులు, జనసేన పార్టీ అభిమానులు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.


















