అగ్రరాజ్యమైన అమెరికాను ప్రసన్నం చేసుకుని తమ సొంత పనులు, సొంత దేశ పనులు విజయవంతంగా పూర్తి చేసుకోవాలని చాలా ప్రపంచ దేశాల నేతలు ఉవ్విళ్లూరుతుంటారు. ఆ ఘన కార్యంలో భాగంగానే తమ దేశాలకు పర్యటన పేరిట విచ్చేసిన అగ్రరాజ్య ముఖ్య నేతలకు జ్ఞాపికలతో సత్కరిస్తాయి. ప్రత్యేక కానుక లతో మెప్పిస్తారు. అదే తరహాలో అమెరికా విదేశాంగ మంత్రిగా ఉన్నకాలంలో మైక్ పాంపియోకు ఒక ఖరీదైన విస్కీ బాటిల్ను జపాన్ ప్రభుత్వం 2019 జూన్ 24న బహుకరించినట్లు అమెరికా ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. ఆ విస్కీ బాటిల్ ఖరీదు దాదాపు రూ.4.32,085. ఖరీదైన బహుమానాలను ప్రభుత్వ పదవిలో ఉన్న వ్యక్తులు తమ సొంతానికి తమ వద్ద అట్టిపెట్టుకోవడానికి వీల్లేదు. అమెరికా చట్టాల ప్రకారం దాదాపు రూ.29 వేలలోపు విలువైన వస్తువులనే అధికారులు/ మంత్రులు తమ వద్ద ఉంచుకోవచ్చు. అంతకుమించి విలువైనవి అమెరికా ప్రభుత్వానికి చెందుతాయి.
కనీసం నేను ఆ బాటిల్ను తాకనైనా తాకలేదు. ఎందుకంటే ఆ బాటిల్ సంగతే నాకు తెలియదు. నాకు ఎవరూ బహుకరించలేదు. అయినా అంతటి ఖరీదైన బాటిల్ను స్వాధీనం చేసుకోవడంలో విదేశాంగ సిబ్బంది ఎలా మిస్ చేస్తారు? అని పాంపియో వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఆ తేదీన ఆయన జపాన్లోని లేరని, సౌదీ అరేబియాకు వెళ్తున్నారని తెలిసింది. బాటిల్ను ఎవరు మాయం చేశారనే దానిపై లోతైన దర్యాపు కొనసాగుతోంది.