ఆర్థిక, ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో నిరసనలు తీవ్ర రూపం దాల్చిన వేళ ప్రధాని రణిల్ విక్రమసింఘే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని పదవికి రణిల్ రాజీనామా చేశారు. నిరసనకారులు ఇంటిని చుట్టుముట్టడంతో అధ్యక్షుడు గోటబయా రాజపక్సే తన అధికార నివాసం నుంచి పరారవగా... ప్రధాని రాజీనామా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. స్పీకర్ అధ్యక్షతన జరిగిన పార్టీ నేతల సమావేశం అనంతరం రణిల్ విక్రమసింఘే తన రాజీనామాను ప్రకటించారు. అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పదవులకు రాజీనామా చేయాలని విక్రమసింఘే, గొటబాయలను పార్టీ నేతలు కోరిన నేపథ్యంలో విక్రమసింఘే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశ ప్రజల భద్రత సహా ప్రభుత్వ కొనసాగింపు కోసం నేను ఈ రోజు పార్టీ నాయకుల ఉత్తమ సిఫార్సును అంగీకరిస్తూ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా అని ప్రకటించారు.




























