చైనా ప్రభుత్వం మైనార్టీలపై మారణ హోమాన్ని సృష్టిస్తోందని గత కొంత కాలంగా అంతర్జాతీయ సమాజం వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు ఐక్యరాజ్య సమితి (యూఎన్) స్వరం కలిపింది. ఉగ్రవాద నిర్మూలన పేరుతో పశ్చిమ జిన్ జియాంగ్ ప్రాంతంలో వీగర్లు, ఇతర ముస్లింలను నిర్బంధించి చైనా ప్రభుత్వం హింసకు పాల్పడుతున్న విషయం వాస్తవమేనని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం పేర్కొంది.
నిర్బంధంలోకి తీసుకున్న మైనార్టీలపై కనీస మానవత్వం చూపించకుండా ఘోరమైన నేరాలకు పాల్పడే అవకాశాలను కొట్టి పారేయలేమని యూఎన్ తాజా నివేదిక స్పష్టం చేసింది. చాలా కాలం కిందటే ఈ నివేదిక బయటకు రావాల్సి ఉంది. కానీ చైనా ప్రభుత్వం ఒత్తిడితో ఇన్నాళ్లుగా యూఎన్ తన నివేదిక బయటక పెట్టలేదు. మానవ హక్కుల చీఫ్ మిషెల్లీ బచెలెట్ తన పదవీ కాలం ముగియడానికి కేవలం 13 నిముషాల ముందు ఈ నివేదిక బటయ పెట్టడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది.














