అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో బిజినెస్ సెమినార్ 2021 ను నిర్వహించారు. వ్యాపారాలకు సంబంధించిన ఆలోచనలను ప్రోత్సహించడం, యువ వాణిజ్యవేత్తలకు మెంటరింగ్, వెంచర్ క్యాపిటలిస్టులకు ఒక వేదిక కల్పించడం స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా, భారతదేశాలకు చెందిన దాదాపు 100 మంది మెంటార్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, వాణిజ్యవేత్తలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. ఆటా వేడుకల బిజినెస్ కమిటీ చైర్ కాశీ కొత్త మాట్లాడుతూ బహుముఖీనమైన లక్ష్యాలతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు వాణిజ్యవేత్తలు, తెలంగాణలోని వ్యాపారవేత్తల మధ్య అనుసంధానాన్ని, అనుబంధాన్ని పెంచడానికి, భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలోని స్టార్టప్ కంపెనీలకు మెంటరింగ్ చేయడం తమ ప్రధాన లక్ష్యాలని వివరించారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్, నిజమాబాద్ లాంటి టైర్`2 నగరాలకు మరిన్ని కంపెనీలను ఆకర్షిచండం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యాలని ఆయన పేర్కొన్నారు.
అమెరికా తెలుగు సంఘం కాన్ఫరెన్స్ సలహా కమిటీ ఛైర్ జయంత్ చల్లా మాట్లాడుతూ తెలుగు వాణిజ్యవేత్తలు అమెరికాలో పాటు ప్రపంచమంతా మంచి గుర్తింపు పొందుతున్నారని కొనియాడారు. భారత్, అమెరికా భాగస్వామ్యాలను ప్రోత్సహించి, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వాణిజ్యవేత్తలను ప్రోత్సహించడానికి ఈ ఆటా బిజినెస్ సెమినార్ ఒక మంచి ప్రయత్నంగా అభివర్ణించారు. 2014 నుంచి ప్రతి రెండేళ్లకోసారి ఆటా ఇలాంటి సెమినార్లు నిర్వహిస్తోందని అన్నారు. ఇప్పటి వరకు భారతీయ స్టార్టప్లలో దాదాపు 20 మిలియన్ డాలర్లు (రూ.150 కోట్లకు పైగా) పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఈ బిజినెస్ సెమినార్ల వల్ల పలు సంస్థలు టైర్`2 నగరాలకు తరలడం ఓ పెద్ద విజయమని జయంత్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో ఆటా ఆధ్యక్షుడు భువనేష్ బూజల, ఆటా వేడుకల చైర్మన్ మధు బొమ్మినేని, సదస్సు సలహా కమిటీ చైర్మన్ జయంత్ చల్లా, సదస్సు సమన్వయకర్త కిరణ్ పాశం, ఆటా వేడుకల బిజినెస్ చైర్మన్ కాశీ కొత్త, ఆట వేడుకల కో చైర్మన్ లక్ష్ చేపూరి తోపాటు తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తెలంగాణ ఐటీ పెట్టుబడుల విభాగం సీఈవో విజయ్ రంగినేని, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సీఈవో శ్రీకాంత్ సిన్హ తదితరులు పాల్గొన్నారు.