62 మంది భారతీయులు నార్త్ ఆఫ్రికా దేశం సూడాన్లో చిక్కుకుపోయారు. సూడాన్లోనే నోబుల్స్ గ్రూప్ అనేది అతి పెద్ద సెరామిక్స్ టైల్స్ కంపెనీ. అయితే ఒకప్పుడు సుడాన్ వేరు. ఇప్పటి సుడాన్ వేరు. సుడాన్ ఎప్పుడైతే రిపబ్లిక్గా అవతరించిందో అప్పటి నుంచి అక్కడ పనిచేసే వర్కర్ల కష్టాలు మొదలయ్యాయి. గత ఆక్టోబర్లో సైనికుల తిరుగుబాటు చర్య వల్ల ప్రస్తుతం అక్కడ మిలిటరీ ప్రభుత్వం నడుస్తోంది. దీంతో నోబుల్ కంపెనీ ఓనర్ మహమ్మద్ మామౌన్ వేరే దేశం పారిపోయాడు. దీంతో నోబుల్స్ గ్రూప్ కంపెనీని అక్కడి మిలిటరీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి అక్కడ పనిచేసే వర్కర్లకు జీతాలు సరిగ్గా ఇవ్వకుండా వాళ్ల పాస్పోర్ట్ను లాక్కొని వాళ్లను దేశం విడిచి వెళ్లకుండా చేస్తున్నారని వర్కర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్లోని పలు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ప్రస్తుతం నోబుల్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. నోబుల్స్ కంపెనీకి పలు బ్రాంచ్లు ఉన్నాయి. రాక్ సెరామిక్స్ ఫ్యాక్టరీ, ఏఎల్ మసా పోర్సెలైన్ ఫ్యాక్టరీలో ఇండియన్స్ పని చేస్తున్నారు.
వీరిని సుడాన్ తీసుకొచ్చిన కాంట్రాక్టర్ శ్రీనివాస రావు తిరుగుబాటుకు మునుపే భారత్కు చేరుకున్నారని సమాచారం. దీంతో ఎటూ పాలుపోక వారు భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించారు. సుడాన్ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పాస్పోర్టు లేకపోవడంతో కనీసం భారతకు రాలేక నానా ఆగచాట్లూ పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు భారత్ ఎంబసీ కొంత మొత్తాన్ని విడుదల చేసింది. ఆ మొత్తాన్ని జాగ్రత్తగా వాడుకునే క్రమంలో వారు ఒంటి పూట భోజనంతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. తాము వైద్య సౌకర్యాలు లేని ప్రాంతంలో ఉంటున్నామని, ఇటువంటి పరిస్థితిలో తమలో ఎవరైనా అనారోగ్యం పాలైతే పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని అటు సుడాన్ అధికారులను ఇటు భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.














