చైనాలో జనాభా తగ్గుతున్నది. 61 ఏళ్ల తర్వాత తొలిసారి ఆ దేశ జనాభా వృద్ధిలో ప్రతికూలత నమోదైంది. జనాభా పెరుగుదలకు చైనా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో వీర్యాన్ని దానం చేయాలంటూ యూనివర్సిటీ విద్యార్థులను చైనా స్పెర్మ్ బ్యాంకులు కోరుతున్నాయి. నైరుతి చైనాలోని యునాన్ హ్యూమన్ స్పెర్మ్ బ్యాంక్ తొలిసారి ఇలాంటి ప్రకటన ఇచ్చింది. స్పెర్మ్ డొనేషన్ విధానం, రిజిస్ట్రేషన్ షరతులు, చెల్లించే రుసుము గురించి అందులో పేర్కొంది. 20 నుంచి 40 ఏళ్ల వయసు, 165 సెంటీమీటర్ల కంటే ఎత్తుగా ఉండి, డిగ్రీ ఉన్న, చదువుతున్న ఆరోగ్యవంతులైన వారు దీనికి అర్హులని వెల్లడించింది. వైద్య పరీక్షల ద్వారా అర్హులైన ఆరోగ్యవంతులు 8-12 సార్లు వీర్యం దానం చేస్తే 4,500 యూవాన్లు (సుమారు రూ.55,000) పొందవచ్చని పేర్కొంది.
మరోవైపు షాంఘై స్పెర్మ్ బ్యాంక్ అత్యధికంగా 7,000 యువాన్లు (సుమారు రూ.85,000) చెల్లించేందుకు ముందుకు వచ్చింది. అయితే కఠిన నిబంధనలు పేర్కొంది. బట్టతల, దృష్టి లోపం, బీపీ వంటి అనారోగ్య సమస్యలు ఉండకూడదని, స్మోకింగ్, మద్యం సేవించే అలవాట్లు లేనివారు అర్హులని వెల్లడించింది.














