ఎయిర్ అరేబియా ఎయిర్లైన్స్ కీలక ప్రకటన చేసింది. యూఏఈ రాజధాని అబుదాబి నుంచి భారత్లోని కోల్కతా నగరానికి ఎయిర్ అరేబియా ఎయిర్లైన్స్ కొత్త సర్వీస్ను ప్రకటించింది. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోల్కతా ఇంటర్నెషనల్ ఎయిర్పోర్టుకు వారానికి మూడుసార్లు ఈ సర్వీస్ ఉంటుంది. మార్చి 15వ తేదీ నుంచి సర్వీస్ను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్ అరేబియా వెల్లడించింది. సోమ, బుధ, శనివారం సర్వీస్ నడిపించనుంది. ఈ మూడు రోజులు అబుదాబి విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 2.25 గంటలకు (యూఏఈ కాలమానం ప్రకారం) విమానం బయల్దేరుతుంది. కోల్కతా ఎయిర్పోర్టులో రాత్రి 8.20 గంటలకు ల్యాండ్ అవుతుంది. తిరిగి కోల్కతా నుంచి రాత్రి 9.05 గంటలకు బయల్దేరి, తెల్లవారుజామున 1.05 గంటలకు అబుదాబి ఎయిర్పోర్టుకు చేరుకుంటుంది. దీనికోసం ఎయిర్ బస్ ఏ320ను వినియోగించనున్నట్లు ఎయిర్ అరేబియా సీఈఓ అదేల్ అల్ అలీ వెల్లడించారు. భారత ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలోనే కోల్కతా నుంచి ఈ కొత్త సర్వీస్ను ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.














