భారత సంతతికి చెందిన మహిళా పోలీస్ అధికారి కెప్టెన్ ప్రతిమ భుల్లార్ మాల్డోనాడో చరిత్ర సృష్టించింది. న్యూయార్క్ పోలీస్ విభాగంలో అత్యున్నత ర్యాంక్ పొందిన దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డుల్లోకెక్కింది. క్వీన్స్లోని రిచ్మండ్ హిల్లోని 102వ పోలీస్ స్టేషన్కు ఆమె ఇన్ఛార్జ్. ఈ క్రమంలో ఆమెకు ఈ ఏడాది ఏప్రిల్లో కెప్టెన్గా ప్రమోషన్ లభించింది. నలుగురు పిల్లల తల్లి అయిన ప్రతిమ భారత్లోని పంజాబ్లో జన్మించారు. తన 9వ యేటానే ఆమె పేరెంట్స్తో కలిసి యూఎస్ వెళ్లారు. అక్కడ న్యూయార్క్లోని క్వీన్స్లో సెటిల్ అయ్యారు. ఇక తనకు దక్కిన అరుదైన గౌరవం పట్ల ప్రతిమ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఇక్కడ భాషాపరమైన అవరోధాలు ఉన్నాయని చెప్పిన ఆమె, ఇలా ఇబ్బందులు పడుతున్న వారిని తాను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. న్యూయార్క్ నగరం ఆసియన్ అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్ హెరిటేజ్ మాసాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో ఆమె తన తండ్రిని గుర్తుచేసుకున్నారు.

















