భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆధునిక అమెరికా ఇండియా స్నేహ సంబంధాల రూపశిల్పి అని అమెరికాలోని బైడెన్ అధికార యంత్రాంగం కొనియాడింది. అమెరికా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి జైశంకర్కు ఇక్కడి ఇండియా రాయబారి తరణ్జిత్ సింగ్ సంధూ ఆధ్వర్యంలో ప్రత్యేక సన్మానం ఏర్పాటు అయింది. ఈ సభకు పలువురు ప్రముఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. యుఎస్ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి, విదేశాంగ శాఖ సహాయ మంత్రి రిచర్డ్ వెర్మా, పాలసీ సలహాదారు నీరా టాండెన్, డాక్టర్ రాహుల్ గుప్తా, డాక్టర్ సేతురామన్ పంచనాథన్ జైశంకర్ను ప్రశసించారు. ఇప్పుడు ఇరు దేశాల నడుమ భాగస్వామ్యం అత్యంత నిర్ణయాత్మక సమున్నత దశకు చేరిందని పలువురు అధికారులు తెలిపారు. ఇందుకు తగు రీతిలో జైశంకర్ చూపిన చొరవ కారణం అని చెప్పారు.














