తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఎన్నారై టీడీపీ కువైట్, జనసేన ఆధ్వర్యంలో మాలియా ప్రాంతంలో జలదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్నారైలు మాట్లాడుతూ 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని ఏ తప్పు చేయకపోయినా తమ రాజకీయ మనుగడ కోసం అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడం సిగ్గుచేటు అని అన్నారు. అక్రమ అరెస్ట్ చేసి ఇన్ని రోజులు అవుతున్నా ఇంతవరకు ఒక్క ఆధారము కోర్టు ముందు ఉంచలేక పోయారు. ఈ ప్రభుత్వం చంద్రబాబును మానసిక క్షోభకు గురి చేసే ప్రయత్నం తప్ప వేరొకటి కాదు అని అన్నారు. బాబుకు ఆరోగ్యం కూడా సహకరించడం లేదని , డీహైడ్రేషన్ సమస్య వల్ల చర్మంపై దద్దుర్లు వచ్చాయని, సదరు జైల్ అధికారి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తెలిపితే వారు వచ్చి వైద్యం చేసి మందులు ఇచ్చారని ప్రకటన విడుదల చేశారన్నారు. అసలు ప్రకటన చేయాల్సిన ప్రభుత్వ డాక్టర్ను ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆయన బరువు కూడా తగ్గారని వార్తలు వస్తున్న నేపథ్యంలో జైల్ అధికారి విడుదల చేసిన ప్రకటనలో ఈ మాట చెప్పనే లేదని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు వైసీపీని బంగాళాఖాతంలో కలపడం ఖాయం అని టీడీపీ జనసేన నేతలు అన్నారు.

ఈ కార్యక్రమంలో గల్ఫ్ ఎన్నారై టీడీపీ కౌన్సిల్ మెంబర్స్ వెంకట్ కోడూరి, ఎన్నారై టీడీపీ కువైట్ ప్రధాన కార్యదర్శి మల్లి మరోతు, సీనియర్ నాయకులు ములకల సుబ్బరాయుడు, బీపీ పెంచలయ్య, పత్తి సుబ్బరాయుడు, డాక్టర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుదరవల్లి కృష్ణ చైతన్య, జనసేన నాయకులు హరి రాయల్, జిలకర మురళి, గాంగరావు చంద్రశేఖర్, అలీ, ఎన్నారై టీడీపీ సమన్వయకర్తలు కోలపనేని రమేష్, ముస్తాన్ ఖాన్, నరసింహులు, హేమంత్ రాయల్, మల్లిసెటి రవి, శ్రీను, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.














