ఫోర్బ్స్ ఇటీవల విడుదల చేసిన వంద మంది భారత సంపన్నుల జాబితా లో ఆరుగురు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉండే భారత ప్రవాసులకు చోటు దక్కింది. వీరిలో ఏకంగా ఐదుగురు కేరళ రాష్ట్రానికి చెందిన వారు కావడం గమనార్హం. ఇక ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఆరుగురు యూఏఈ ఎన్నారైలలో ఎంఏ యూసఫ్ అలీ (లులూ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్), రేణుక జగత్యానీ (ల్యాండ్మార్క్ గ్రూప్ ఛైర్వుమెన్), జాయ్ అలుక్కాస్ (జాయ్ అలుక్కాస్ గ్రూప్ ఛైర్మన్), డా. షంషీర్ వయలీల్ (బుర్జీల్ హోల్డింగ్స్ వ్యవస్థా పకుడు, ఛైర్మన్), రవి పిళ్లై (ఆర్పీ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్), సన్నీ వార్కీ (జెమ్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు) ఉన్నారు.
లులూ గ్రూప్ అధినేత 7.1 బిలియన్ డాలర్ల సంపదతో ఈ ఆరుగురిలో మొదటి స్థానంలో నిలిచారు. గతేడాది యూఫ్ అలీ 5.4 బిలియన్ డాలర్లతో 35 స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది 8 స్థానాలు ఎగబాకి 27వ ర్యాంకు దక్కించుకున్నారు. ల్యాండ్మార్క్ గ్రూప్ ఛైర్వుమెన్ రేణుక జగత్యానీ 4.8 బిలియర్ డాలర్ల సంపదతో 44వ స్థానంలో నిలిచారు. జాయ్ అలుక్కాస్ 4.4 బిలియన్ డాలర్లతో 50వ స్థానంలో, డా. షంషీర్ 3.7 బిలియన్ డాలర్లతో 57వ స్థానం, రవి పిళ్లై 3.2 బిలియన్ డాలర్ల సంపదతో 69వ స్థానం, 2.93 బిలియన్ డాలర్లతో సన్నీ వార్కీ 78వ స్థానం దక్కించుకున్నారు.














