తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. స్కిల్ డెవల్పమెంట్ కేసులో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు, వైసీపీ సర్కారుపై పూర్తి స్థాయిలో పోరాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించలేమని భావిస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్ సందర్భంగా కాసానికి చంద్రబాబు సూచించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తెలంగాణపై ఫోకస్ పెట్టలేం. దిగితే పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలి. ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మీరంతా చూస్తున్నారు. వచ్చే మే నెలలో ఏపీ ఎన్నికలు జరగబోతున్నాయి. పూర్తి శక్తియుక్తులు కేటాయించి ఇక్కడ ఎన్నికల్లో పోరాడి ఫలితం సాధించాలి. నేను చెప్పిన విషయాలపై మీరు కూడా ఆలోచన చేయండి. అవసరమైతే మనం మరోసారి చర్చిద్దాం అని తెలిపినట్లు సమాచారం. ఇప్పటికైతే పోటీ కష్టమని అనిపిస్తోందని కాసాని జ్ఞానేశ్వర్కు సర్దిచెప్పినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా పార్టీ అధినేత నిర్ణయం నేపథ్యంలో కాసాని పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే అలాంటిదేమీ లేదని చెబుతున్నా ఆయన.. ఆయన కుమారుడు మాత్రం పార్టీనుంచి బయటకు వచ్చి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ లక్ ను ప్రదర్శించుకోవాలన్న యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.