స్రవంతి రవికిశోర్ నిర్మాతగా రానున్న మరో విభిన్న చిత్రం దీపావళి. రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ చిత్రం కీడ కు ఇది తెలుగు అనువాదం. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దర్శకుడు ఆర్ఏ వెంకట్. ఈ సందర్భంగా రవికిశోర్ విలేకరులతో ముచ్చటించారు. నిర్మాతగా 36ఏండ్ల నా ప్రయాణాన్ని చూస్తే గర్వంగా ఉంటుంది. ఇప్పటివరకూ బౌండ్ స్క్రిప్ట్ లేకుండా సినిమా చేయలేదు. ఇన్నాళ్ల వ్యవధిలో తక్కువ సినిమాలు చేయడానికీ కారణం అదే.కీడ కథ నచ్చి నా అంతట నేను దర్శకుడు వెంకట్కి ఫోన్ చేశాను. తను వేరేవాళ్లతో కమిటయ్యానన్నాడు. అవకాశం ఉంటే చెప్పమన్నాను. అదృష్టం బావుండి చివరకు అది నా దగ్గరకే వచ్చింది. బౌండ్ స్క్రిప్ట్ రికార్డ్ చేసి పంపమని అడిగా. తను పంపాడు. విని ఓకే చేశా. ఇక ఏ రోజూ అతని పనిలో జోక్యం చేసుకోలేదు. ప్రాణంపెట్టి కథ రాసుకున్నాడు. ప్రాణం పెట్టి తీశాడు. అవసరమైన డబ్బుని మాత్రం ఏర్పాటు చేశా. విడుదలకు ముందే వివిధ చిత్రోత్సవాల్లో ఈ సినిమా ప్రదర్శించబడి విమర్శకుల ప్రశంసలందుకుంది.
మొదట తమిళంలోనే విడుదల చేయాలనుకున్నాం. కానీ కరోనా తర్వాత మన ప్రేక్షకులు అన్ని భాషలనూ ఆదరిస్తారని అర్థమైంది. ముఖ్యంగా బలగం సినిమాకు వచ్చిన స్పందన చూశాక, దీపావళి ని కూడా తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని నమ్మకం కుదిరింది. ఇటీవలే ఈ సినిమా ప్రీమియర్ షో వేశాం. చూసిన వారంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. రేపు థియేటర్లలో కూడా ఇలాంటి స్పందనే వస్తుందని నమ్మకంగా చెప్పగలను. ఈ నెల 11న ఈ సినిమా విడుదలకానుంది.














