బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ జనాభా నియంత్రణపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యల్ని పలు రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో నితీశ్ వ్యాఖ్యలపై అమెరికన్ సింగర్, ఆఫ్రికన్-అమెరికన్ నటి మేరీ మిల్బెన్ స్పందించారు. సీఎం వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఓ భారత పౌరురాలిని అయి ఉంటే, బీహార్ సీఎం పదవికి పోటీ చేసి ఉండేదాన్నని పేర్కొన్నారు. ధైర్యవంతురాలైన మహిళ ముందుకు రావాలి. బీహార్ ముఖ్యమంత్రిగా పోటీ చేసేందుకు అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలి. బీహార్ ప్రజలారా, భారత ప్రజలారా మహిళకు ఓటు వేసే శక్తిమీకుంది. మార్పుకు ఓటువేసే శక్తి మీకు ఉంది. ధైర్యవంతురాలైన మహిళ బీహార్ సీఎంగా తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. బీహార్లో నాయకత్వానికి ఓ మహిళకు సాధికారత కల్పించాలని నేను కోరుతున్నా అని ఆమె పేర్కొన్నారు.
ఇటీవల బీహార్లో నిర్వహించిన కులగణనకు సంబంధించి నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా నితీశ్ మాట్లాడుతూ భర్తల చర్యల వల్ల జననాలు పెరిగాయి. అయితే చదువుకున్న మహిళలకు తన భర్తను ఎలా నియంత్రించాలో తెలుసు. అందుకే ఇప్పుడు జననాల రేటు తగ్గుతూ వస్తున్నది అని మాట్లాడారు. అయితే, ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి.














