జూనియర్ ఎన్టీఆర్ మీడియా ద్వారా అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. కొంతకాలంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రాలేదు. రీసెంట్గా ఆయన నటించిన దేవర మూవీ సంచలన విజయం అందుకున్నప్పటికీ, ఎటువంటి సక్సెస్ మీట్ను నిర్వహించలేదు. దేవర ప్రీ రిలీజ్ వేడుకని గ్రాండ్గా నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ చివరి నిమిషంలో ఆ వేడుకను రద్దు చేశారు. దీంతో అభిమానులకు, జూనియర్ ఎన్టీఆర్కు దూరం పెరిగినట్లుగా భావించిన కొందరు అభిమానులు. ఆయనను కలుసుకునేందుకు ఎక్కడెక్కడి నుండో పాదయాత్రలు చేసుకుంటూ వస్తుండటం నచ్చని ఎన్టీఆర్.. తాజాగా ఓ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటనలో తనపై తన ఫ్యాన్స్ చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి ఎన్టీఆర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని, త్వరలో ఒక చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసి, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరినీ కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని అనుమతులు తీసుకుని నిర్వహించాలని ఆయన భావిస్తున్నారు.
పోలీస్ డిపార్ట్మెంట్ మరియు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంత పెద్ద సమావేశం నిర్వహించటానికి కొంత సమయం అవసరం అవుతుంది కాబట్టి, అప్పటి వరకు అభిమానులు ఓర్పుగా ఉండాలని ఎన్టీఆర్ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో, ఫ్యాన్స్ తనను కలుసుకోవడానికి పాదయాత్ర వంటివి చేయరాదని జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేస్తున్నారు. తన అభిమానుల ఆనందమే కాదు, వారి సంక్షేమం కూడా తనకు అత్యంత ప్రధానమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. త్వరలోనే అభిమానులను కలుసుకునే వేడుకకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని ఈ ప్రకటనలో తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)