నాలుగు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ -వేవ్స్ ముంబై వేదికగా జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా ప్రారంభమైంది. కనెక్టింగ్ క్రియేటర్స్ కనెక్టింగ్ కంట్రీస్ అనే ట్యాగ్ లైన్ తో ఈ వేవ్స్ సమ్మిట్ ను నిర్వహిస్తుంది. ఇది మీడియా, వినోద పరిశ్రమలను ఒకచోట చేర్చే నాలుగు రోజుల కార్యక్రమం కాగా, ఆ కార్యక్రమానికి మీడియా, వినోద రంగానికి చెందిన సీఈఓలు, పరిశ్రమలకి చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు.

ఈ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించగా, కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వేవ్స్ అనేది కేవలం ఒక పదం కాదని, ఇది సంస్కృతి, సృజనాత్మకత, చలనచిత్ర సంగీతం, గేమింగ్, కథ చెప్పడం లాంటి కలయిక అంటూ వివరించారు. గత వందేళ్లలో భారతీయ సినిమా ఉన్నత శిఖరాలకి కూడా చేరుకుందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ సమ్మిట్లో బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్ , రణ్బీర్ కపూర్ , దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా, రజనీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్ సహా ఇతర ప్రపంచ తారలు పాల్గొన్నారు.

అయితే రజనీకాంత్, మోహన్ లాల్, హేమ మాలిని, చిరంజీవి, అక్షయ్ కుమార్, మిథున్ చక్రవర్తి, మోహన్ లాల్ కలిసి ఓ గ్రూప్ ఫొటో దిగారు. ఈ పిక్ ఎంతగానో ఆకట్టుకుంది. చిరంజీవి ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్ నుంచి ముంబయి చేరుకున్నారు. ఆయనకి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. వేవ్స్ సమ్మిట్కి చిరు చాలా సింపుల్గానే వెళ్లారు.