అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్నాయి. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తాజా అంశాలపై చర్చించేందుకు రావాలని ఇరాన్ కోరిందన్నారు. టెహ్రాన్ అభ్యర్థన మేరకు ఖతార్ రాజధాని దోహా వేదిగా సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. ఇరుదేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారని చెప్పారు. ఈ సమావేశంలో తుది ఒప్పందంపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా ఖతార్లో ఈ వారం ఇరాన్, అమెరికా బృందాల మధ్య సమావేశాలు నిర్వహించే ప్రణాళికలేవీ లేవని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరిబబాడి పేర్కొన్నారు. తమ హామీల అమలుకు సంబంధించి అమెరికా తీసుకుంటున్న చర్యల పర్యవేక్షణ, ఖతార్తో సంప్రదింపులు యథావిధిగా కొనసాగుతున్నాయని అన్నారు. అయితే దోహాలో మంగళవారం ఇరుదేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరగనున్నట్లు వస్తున్న వార్తలను తాము ధ్రువీకరించలేమని తెలిపారు. పరిస్థితులు చక్కబడిన తర్వాతే చర్చలు జరుగుతాయని స్పష్టంచేశారు.





























