తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా బతుకమ్మ ను విశ్వ వేదికపై ప్రదర్శించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత చొరవతో దుబాయిలోని అతి ఎత్తయిన కట్టడం బుర్జ్ ఖలీఫా తెరపై బతుకమ్మ విశిష్టతను చాటేలా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. బతుకమ్మ పండుగపై రూపొందించిన మూడు నిముషాలు నిడివిగల వీడియోను శనివారం రాత్రి 9:30కు, తిరిగి 10:30కు ( అక్టోబర్ 23)న రెండు పర్యాయాలు ప్రదర్శించారు. జై తెలంగాణ, జై హింద్ నినాదాలతో పాటు బతుకమ్మ చిత్రాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాన్ని బుర్జ్ ఖలీపా తెరపై ప్రదర్శించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ బుర్జ్ ఖలీఫా తెరపై కనిపించగానే కార్యక్రమానికి హాజరైన తెలంగాణవాసులు హర్షం వ్యక్తం చేశారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు బతుకమ్మ వీడియోను తిలకించారు.














