కరోనా మహమ్మారి ఇంకా తగ్గలేదని, ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సంస్థ హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సమీక్షా కార్యక్రమంలో చీఫ్ టెడ్రోస్ అధానమ్ ఘెబ్రియేసస్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం కోరుకున్నప్పుడే ఈ మహమ్మారిని అంతమొందించగలమని తెలిపారు. మన దగ్గర కరోనాను అంతం చేయడానికి కావలసిన వనరులు ఉన్నాయి. ప్రభావవంతమైన ప్రజారోగ్య వనరులు, శక్తిమంతమైన మెడికల్ వనరులు అన్నీ ఉన్నాయి. కానీ ప్రపంచం వాటిని సరిగా ఉపయోగించుకోలేదు అని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారి తగ్గిపోయిందని భావించడం సరికాదని అన్నారు. ఇప్పటికే వారానికి 50 వేల కరోనా మరణాలు ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.














