అగ్రరాజ్యం అమెరికా భారతీయులకు తీపి కబురు చెప్పింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై విధించిన ఆంక్షలను అగ్రరాజ్యం అమెరికా సడలించింది. ఈ మేరకు చేసిన నిబంధనలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. ఈ రూల్స్ ప్రకారం అమెరికాకు వచ్చే విదేశీయులు వ్యాక్సిన్ తీసుకున్నట్లు ధ్రువపత్రాలు చూపించాలి. చైనా, భారత్, యూరప్ దేశాలపై విధించిన కఠిన ఆంక్షలు కూడా నవంబర్ 8 నుంచి సడలిస్తున్నట్లు ఈ ఉత్తర్వులు తెలిపాయి. కరోనా మహమ్మారి కారణంగా 2020 నుంచి అమెరికా వచ్చే విదేశీ ప్రయాణికులపై కఠినమైన ఆంక్షలు విధించారు.
ఈ నిబందనల ప్రకారం బ్రిటన్ సహా యూరోపియన్ యూనియన్కు చెందిన 26 దేశాలు, ఐర్లాండ్, చైనా, ఇండియా, దక్షిణాఫ్రికా, ఇరాన్, బ్రెజిల్ దేశాలను సందర్శించిన వారిని అమెరికాలోకి రానివ్వలేదు. ఈ క్రమంలోనే దేశాల వారీ ఆంక్షలను తొలగించింది. ప్రధానంగా వ్యాక్సినేషన్ ఆధారంగా ఆంక్షలు విధించాలని బైడెన్ నిర్ణయించారు.














