ఆధ్యాత్మిక, జానపద గీతాలను ఆలపిస్తూ మైథిలీ ఠాకూర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో కూడా ఆమె రికార్డు నెలకొల్పారు. బీహార్ అసెంబ్లీ కి ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా నిలిచారు. మైథిలీ ఠాకూర్ అలీనగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ (BJP) అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఆమె, ఆర్జేడీ దిగ్గజ నేత వినోద్ మిశ్రాను 11 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడించారు.

దాంతో తొలిసారి బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. వాస్తవానికి 2008లో అలీనగర్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత బీజేపీ ఇక్కడ తొలిసారి జయకేతనం ఎగురవేసింది. ఇన్స్టా, యూట్యూబ్లో కలిపి ఆమెకు 1.1 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఫేస్బుక్లో అయితే 1.4 కోట్ల మంది ఆమెను అనుసరిస్తున్నారు. 2024లో శబరి మీద పాడిన ఆమె పాట ప్రధాని మోదీని ఆకర్షించింది. ప్రధాని ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు.
















