అమెరికా లో అక్రమంగా ఉంటూ వీసా మోసాలకు పాల్పడుతున్నారన్న అభియోగాలపై 11 మంది భారతీయుల ను పోలీసులు అరెస్టు చేశారు. గ్రీన్కార్డుల కోసం వీరు చోరీల డ్రామాలకు పాల్పడినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. దోపిడీ బాధితులం అంటూ కట్టుకథలు అల్లి యూ-వీసా పొందేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. అయితే, హింసాత్మక నేరాల్లో బాధితులైన వారు అమెరికాలో చట్టబద్ధంగా ఉండేందుకు యూ-వీసా (నాన్ ఇమిగ్రేషన్ స్టేటస్) కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీసాతో వలసదారులకు పని అనుమతులతో పాటు 5-10 ఏళ్లలో గ్రీన్కార్డు పొందేందుకు మార్గం దొరుకుతుంది. దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు వలసదారులు మోసాలకు పాల్పడినట్లు యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు వెల్లడించారు.

ఈ కేసులకు సంబంధించి మసాచుసెట్స్, కెంటకీ, ఒహాయో తదితర రాష్ట్రాల్లో 11 మంది భారతీయులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరంతా అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీరిలో ఓ వ్యక్తిని భారత్కు డిపోర్ట్ చేయగా మరో ఆరుగురిని కోర్టులో హాజరుపర్చి విడుదల చేశారు. మిగతా నలుగురిని రిమాండ్లో ఉంచారు. నిందితులు ఓ ముఠాగా ఏర్పడి వ్యవస్థీకృత మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఫాస్ట్ఫుడ్ రెస్టారంట్లు, మద్యం దుకాణాలు, స్టోర్ల వద్ద దోపిడీలు చేయించినట్లు తెలిపారు. అనంతరం ఈ ఘటనల్లో తాము బాధితులమంటూ నమ్మించి యూ వీసాలకు దరఖాస్తులు చేసే ప్రయత్నం చేశారని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో నేర నిర్ధారణ అయితే నిందితులకు ఐదేళ్ల వరకు జైలుశిక్ష, 2.5 లక్షల డాలర్ల జరిమానా పడే అవకాశం ఉంటుంది.















