రామ్చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వెంకట సతీష్ కిలారు నిర్మించిన చిత్రం పెద్ది. ఇటీవలే విడుదలై విజయపథంలో పయనిస్తున్నది. హైదరాబాద్ లో థాంక్యూ మీట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్చరణ్ మాట్లాడుతూ ప్రేక్షకులు పెద్ది సినిమాను స్వీకరించిన తీరు చూస్తుంటే నిజాయతీగా పనిచేస్తే ఏ సినిమా అయినా హిట్ కావాల్సిందే అనే నమ్మకం ఏర్పడింది. నాకు నచ్చిన పని చేస్తూ మీ అందరి ప్రేమను పొందడం ఆశ్చర్యంగా ఉంది అన్నారు. ఇండియాతో పాటు విదేశాల్లో కూడా రోజురోజుకి కలెక్షన్స్ పెరగడం ఆనందంగా ఉంది. సినిమా చూసినవాళ్లందరూ స్ఫూర్తివంతమైన కథ ఇదని అంటున్నారు. ప్రేక్షకుల మధ్య థియేటర్లలో సినిమా చూశా. నేను ఊహించని సన్నివేశాలకు కూడా వాళ్లు చప్పట్లు కొడుతున్నారు. నిజంగా ఇదో కొత్త అనుభూతి. నా సినీ లైబ్రరీలో నెంబర్ వన్గా నిలిచే సినిమా ఇది అన్నారు.

ఖేలో ఇండియా స్ఫూర్తితో, భారతీయ జీవన విధానంలో ఆట ఓ భాగమని చెప్పాలనే లక్ష్యంతో ఈ సినిమా తీశానని, ఇదొక స్ఫూర్తినింపే గాథ అని దర్శకుడు బుచ్చిబాబు సానా అన్నారు. సోమవారం కూడా కలెక్షన్స్ ఎక్స్ట్రార్డీనరీగా ఉన్నాయని, హిందీలో కూడా అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, నిర్మాతగా మోస్ట్ మెమొరబుల్ మూవీ ఇదని నిర్మాత వెంకట సతీష్ కిలారు ఆనందం వ్యక్తం చేశారు.





























