Skip to main content

Namaste NRI

రాష్ట్ర సచివాలయం ప్రధాన ద్వారం ముందు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ

తెలంగాణ దర్పం, పోరాట స్ఫూర్తి ఉట్టిపడేలా, ఆత్మవిశ్వాసం తొణికిసలాడే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దొరతనానికి ప్రతీకగా కాకుండా ప్రజలు తమ కన్నతల్లిని చూసుకున్నంత సంతోషకరంగా తెలంగాణ తల్లి రూపం ఉంటుందని స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ప్రధాన ద్వారం ముందు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. మిలియన్ మార్చ్ తరహాలో లక్షలాది మంది సమక్షంలో డిసెంబర్ 9న వైభవోపేతంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేపడతామని ప్రకటించారు.

సంకల్పం, పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని తెలంగాణ ఉద్యమం నిరూపించిందని, ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ గారు రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని ముఖ్యమంత్రి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ ఆవరణలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని దశాబ్ది వేడుకల సందర్భంలోనే తాను ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. విగ్రహ నమూనా రూపొందించే బాధ్యతను జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ విభాగానికి అప్పగించామన్నారు.

సచివాలయం లోపల తెలంగాణ తల్లి, మరోవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం, దానికి ఎదురుగా పీవీ నర్సింహారావు, అంజయ్య గార్ల విగ్రహాలు, జైపాల్ రెడ్డి గారి స్మారకం, ఇటువైపు కాకా వెంకటస్వామి తదితర మహానుభావుల విగ్రహాలు, అమరవీరుల స్మారకచిహ్నం -సచివాలయానికి మధ్య దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ గారి విగ్రహం శోభాయమానంగా ఉంటుందని, మేధావుల సూచనల మేరకే ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News