అమెరికా లోని కాలిఫోర్నియాలో అధ్యక్షుడు జో బైడెన్ ఎమర్జెన్సీ ప్రకటించారు. కొన్ని వారాలుగా తుఫాన్తో భారీ వర్షాలతో కాలిఫోర్నియా ప్రజలు అల్లాడిపోతున్నారు. కాలిఫోర్నియాలో భారీ విపత్తు చోటు చేసుకున్నదని జో బైడెన్ ప్రకటించారు. కాలిఫోర్నియాలో ఎమర్జెన్సీ ప్రకటించడంతో బాధితులకు తాత్కాలిక వసతి కల్పిస్తారు. వరదల వల్ల కాలిఫోర్నియాలో కనీసం 19 మంది మృతి చెందారు. వరద నీరు లోతట్టు ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నది. కోస్తా పొడవునా మూడంతస్తుల ఎత్తులో అలలు ఎగసి పడుతున్నాయి. ఈ వరదల వల్ల 34 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. కాలిఫోర్నియాలోని సాలినాస్ నది వరదతో పరివాహక ప్రాంతాల్లో పొంగి పొర్లుతున్నది. జాతీయ రహదారులపై వరద నీరు ప్రవహిస్తున్నది. మరో తుఫాన్ పొంచి ఉన్న నేపథ్యంలో 24 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ రాష్ట్ర ప్రజలకు అవసరమైన ఆర్థిక, హార్థిక సాయం అంద జేయాలని జో బైడెన్ అధికారులను ఆదేశించారు. తీవ్ర శీతాకాల తుఫాన్ వల్ల పోటెత్తిన వరదల వల్ల విరిగి పడ్డ మట్టి చరియల్లో, బురదలో చిక్కుకున్న బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.




























