దుబాయ్ అజమాన్ లో గణపతి ఉత్సవాలు 5 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం భక్తి శ్రద్ధలతో దంపతులతో పూజలతో పాటు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు నిర్వహించారు. భారత్ నుంచి ప్రత్యేకంగా తీసుకు వచ్చిన 5 అడుగుల మట్టి గణపతి మైత్రి పొలం లో ప్రతిష్ఠించి, 5వ రోజు మాతృభూమిని తలపించేలా తీన్ మార్ డప్పులతో మహిళల, పిల్లల నృత్యాలుతో ఊరేగింపుగా అంగరంగ వైభవంగా గణనాథుడిని నిమజ్జనం చేశారు. ఉదయం నుంచి గణపతి హోమం, కుంకుమ పూజా కార్యక్రమాలు, గణపతి పూజలు నిర్వహించారు. రికార్డు స్థాయిలో వేలంలో లడ్డూను ఎఇడి 7500/- (1,68,000 రూపాయలు) లకు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంకు చెందిన శ్రీ నాగేంద్ర డేగల సొంతం చేసుకున్నారు. గణపతికి అలంకరించిన లక్ష్మి మాలను వేలంలో ఎఇడి 1300/-(30,000/-) నిజామాబాద్కు చెందిన అరుణ్ కుమార్ సూరినీడ సొంతం చేసుకున్నారు.
నిర్వాహకుల తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కేసరి త్రిమూర్తులు మాట్లాడుతూ స్వదేశానికి దూరంగా ఉంటూ మన తెలుగు సంప్రదాయాలను మన పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో, ఇటువంటి ఎన్నో సంప్రదాయ కార్యక్రమాలు మైత్రి పొలం లో నిర్వహిస్తున్నట్టు తెలియచేశారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించామని, వచ్చే ఏడాది ఆ గణేశ్ని కృపతో ఇంకా ఘనంగా నిర్వహించుతామని తెలియచేశారు. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ కమిటీకి, ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి త్రిమూర్తులు పేరుపేరునా ధన్యవాదాలు తెలియ చేశారు.














